ఉద్దేశ‌పూర్వ‌కంగా నీటి గొడవలు పెంచకూడ‌దు

జగన్‌, కేసీఆర్‌ రాజకీయ అవసరాల కోసం ఇటువంటి ప‌నులు చేయొద్దు: రఘురామకృష్ణరాజు

అమరావతి : ఎంపీ రఘురామకృష్ణరాజు నీటి పంప‌కాల విష‌యంలో ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. నవసూచనల పేరిట సీఎం జ‌గ‌న్‌కు ఆయ‌న ఈ రోజు నాలుగో లేఖ రాసి ఈ అంశాన్ని ప్ర‌స్తావించారు. రాజకీయ అవసరాల కోసం ఇరు రాష్ట్రాల సీఎంలు ఉద్దేశ‌పూర్వ‌కంగా ఈ గొడవలు పెంచకూడ‌ద‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. న‌దీ జలాల విష‌యంలో జ‌గ‌న్ చేసిన వ్యాఖ్యలపై ఇరు రాష్ట్రాల ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ఆయ‌న చెప్పుకొచ్చారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొన‌సాగించాల‌ని, దీంతో ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చని జగన్ అన్నార‌ని, మ‌రి జల వివాదాలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని రఘురామకృష్ణరాజు నిల‌దీశారు.

జ‌గ‌న్ నిన్న మాట్లాడుతూ తెలంగాణలోని ఆంధ్రా వారి గురించి వ్యాఖ్య‌లు చేయ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని ర‌ఘురామ‌ చెప్పారు. నీటి వివాదంపై ప్రధాని మోడి కి జ‌గ‌న్ లేఖలు రాయడం వల్ల సత్వర పరిష్కారం ఉండదన్న సంగతి జగన్‌కు కూడా తెలుస‌ని రఘురామకృష్ణరాజు అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు సమావేశమై చ‌ర్చ‌లు జ‌రిపి వివాదాలను పరిష్కరించాలని ఆయ‌న కోరారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/