గజేంద్ర సింగ్ షెకావత్ తో రఘురామకృష్ణరాజు భేటీ
పోలవరం ప్రాజెక్టులో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదు
న్యూఢిల్లీ : వైస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో ఈ రోజు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈసందర్బంగా రఘురామకృష్ణ పోలవరం ప్రాజెక్టులో అక్రమాలు జరుగుతున్నాయని షెకావత్కు ఫిర్యాదు చేశారు. పోలవరం నిర్వాసితుల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. నకిలీ ఖాతాలతో నిర్వాసితుల సొమ్మును కాజేస్తున్నారని తెలిపారు. లబ్ధిదారులను పక్కనపెడుతూ నకిలీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, రివర్సర్ టెండరింగ్ పేరుతో అదనపు నిధులు కేటాయిస్తున్నారని అన్నారు.
ఈ కేటాయింపుల్లో 25 శాతం వరకు కమీషన్లు కోరుతున్నారని రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. నకిలీ లబ్దిదారుల పేర్లతో ఖాతాలు తెరిచి పునరావాస నిధులు కాజేస్తున్నారని ఫిర్యాదు చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అలాగే, ఏపీ సీఐడీ పోలీసులు తనపై వ్యవహరించిన తీరును కూడా గజేంద్ర సింగ్ షెకావత్కు రఘురామ వివరించినట్టు తెలిసింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/