ఎంపీ గోరంట్ల మాధవ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు

వైస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. మూడున్నర సంవత్సరాలుగా అద్దె, విద్యుత్తు బిల్లులు చెల్లించకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని మాధవ్ అద్దెకుండే ఇంటి యజమాని మల్లికార్జునరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే..

అనంతపురంలోని రాంనగర్ 80 అడుగుల రోడ్డులోని మల్లికార్జున రెడ్డి ఇంట్లో గోరంట్ల మాధవ్ తాను ఎంపీగా గెలుపొందాక ఉండటం కోసం ఆ ఇంటిని అద్దెకు అడిగారు. అద్దెకు దిగే సమయంలో 6 నెలలే ఉండి ఖాళీ చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఇంట్లోకి దిగిన దగ్గరి నుండి ఇంటి అద్దె కట్టడం లేదని , కరెంట్ బిల్లు కూడా కట్టడం లేదని మల్లికార్జున రెడ్డి వాపోయారు. మూడున్నర సంవత్సరాల నుంచి అద్దెతోపాటు విద్యుత్తు బిల్లులు కూడా చెల్లించకపోవడంతో సెప్టెంబరు నెలలో ఖాళీ చేయాలని మల్లికార్జునరెడ్డి కోరారు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం రేకెత్తింది. పోలీసులు, పలువురు రాజకీయ నాయకులు కల్పించుకుని మరో 2 నెలలు ఉండేలా అక్టోబరు వరకు గడువు ఇప్పించారు.

గడువు ముగిసిన తర్వాత కూడా ఖాళీ చేయకపోవడంతో మల్లికార్జునరెడ్డి మరికొందరు పెద్దలను తీసుకొని ఎంపీ దగ్గరకు వెళ్లి ఇంటిని ఖాళీ చేయాలని కోరారు. ఎంపీ వాగ్వాదానికి దిగడంతోపాటు ఇల్లు మారేది లేదంటూ తెగేసి చెబుతున్నారని మల్లికార్జునరెడ్డి వెల్లడించారు. అద్దెకింద రూ.13 లక్షలు, విద్యుత్తు బిల్లుల కింద రూ. 2,50,413 చెల్లించాల్సి ఉందని మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఇక ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కి పార్టీ కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని వైస్సార్సీపీ శ్రేణులు సైతం గోరంట్ల మాధవ్ ఫై ఆగ్రహం గా ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ అద్దె వ్యవహారం తో మరోసారి వార్తల్లో నిలువడం వైస్సార్సీపీ కి మరింత చెడ్డ పేరు తెచ్చేలా ఉందని అంత మాట్లాడుకుంటున్నారు.