రైల్వే అభివృద్ది పనులపై ఎంపీ బండి సమీక్ష

హైదరాబాద్ : కరీంనగర్ పట్టణం తీగలగుట్టపల్లిలోని లెవల్ క్రాసింగ్ (ఎల్సీ నం.18) వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని కరీంనగర్ ఎంపీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ రైల్వే అధికారులను కోరారు. తీగలగుట్టపల్లిలో 100 కోట్లతో కేంద్ర ప్రభుత్వంచే మంజూరు చేసిన రోడ్ ఓవర్ బ్రిడ్జి పనుల ప్రారంభ అంశంపై శనివారం హైదరాబాద్ లో సికింద్రాబాద్ డివిజన్ రైల్వే సీనియర్ ఇంజనీర్ అక్కిరెడ్డితో ఎంపీ బండి సంజయ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

తీగలగుట్టపల్లి ప్రాంతంలో రోడ్ ఓవర్ బ్రిడ్జి లేక ప్రజలు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి, ఇబ్బందులకు గురవుతున్న దృష్ట్యా.. బండి సంజయ్ చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ స్పందించి ఇక్కడి ప్రాంతంలో వంద కోట్ల నిధులతో రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు నిధులు కేటాయించినందున తీగలగుట్టపల్లి ప్రాంతంలో త్వరితగతిన నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆయన రైల్వే అధికారులను కోరారు. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కరీంనగర్ రైల్వే స్టేషన్ లో కోటి 60 లక్షల నిధులతో మంజూరైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. అలాగే, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కమలాపూర్, ఉప్పల్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఆర్ఓబి పనులను వేగవంతం చేయాలని సంజయ్ సూచించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/