ఒమిక్రాన్ బాధితుల‌లో వ్యాక్సిన్ తీసుకున్నవారే ఎక్కువ : అమెరికా

న్యూయార్క్ : క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అమెరికాలో ద‌డ పుట్టిస్తోంది. అగ్రరాజ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు 43 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కానీ ఈ 43 మందిలో రెండు డోసుల తీసుకున్న వారే ఎక్కువ‌. అమెరికా సిడిసి (సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్) తాజా నివేదిక ప్ర‌కారం దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 43 ఒమిక్రాన్ కేసులు న‌మోదు కాగా.. వీటిలో 34 మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న‌వారున్నారు. వీరిలో 14 మంది బూస్ట‌ర్ డోసు(మూడో డోసు) కూడా తీసుకున్న‌వారు ఉండ‌డం గ‌మ‌నార్హం.

అమెరికాలోని మొత్తం 22 రాష్ట్రాల‌లో ఈ కేసు న‌మోద‌య్యాయి. సంఖ్యాప‌రంగా ఈ కేసులు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. సిడిసి నివేదికతో గణాంకాల‌ను చూస్తే.. అస‌లు ఒమిక్రాన్ ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్నాయా? వ్యాక్సిన్ల ప్ర‌భావం ఒమిక్రాన్‌పై ఉంటుందా? అనే సందేహాలు క‌లుగుతున్నాయి. ఈ 43 కేసుల‌లో 25 మంది 18 నుంచి 39 వ‌య‌సు క‌ల‌వారున్నారు. కేవ‌లం ఆరుగురు మాత్ర‌మే ఇంత‌కుముందు క‌రోనా సోకిన వారున్నారు. అగ్రరాజ్యంలో ఒమిక్రాన్ మొట్ట‌మొద‌టి కేసు డిసెంబ‌రు 1న న‌మోదు అయింది. అది కూడా పూర్తిగా వ్యాక్సినేష‌న్ తీసుకున్న వ్య‌క్తికే కావ‌డం గ‌మ‌నార్హం. అత‌ను న‌వంబ‌ర్ 15న ద‌క్షిణాఫ్రికా నుంచి అమెరికా వ‌చ్చాడ‌ని సిడిసి అధికారులు తెలిపారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/