యెమెన్ జైలుపై వైమానిక దాడి..100 మంది మృతి

పెరుగుతున్న మృతుల సంఖ్య

యెమెన్ : యెమెన్ జైలుపై జరిగిన వైమానిక దాడిలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గత రాత్రి జరిగిన ఈ భయంకరమైన దాడి తర్వాత మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. హౌతీ రెబల్స్ సొంత నగరమైన సాదాలో జరిగిన ఈ దాడిపై యెమెన్‌లోని రెడ్‌క్రాస్ సంస్థ అంతర్జాతీయ ప్రతినిధి బషీర్ ఒమర్ మాట్లాడుతూ.. మృతుల సంఖ్య పెరుగుతోందన్నారు. వందమందికిపైగా మృతి చెందారని పేర్కొన్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని సహయక సిబ్బంది వెలికి తీస్తున్నారు. ఈ ఘటన తర్వాత అక్కడ పరిస్థితులు హృదయ విదారకంగా మారాయి. క్షతగాత్రులను, మృతదేహాలను వెలికి తీస్తున్న వీడియోలను హౌతీ రెబల్స్ విడుదల చేశారు. సౌదీ సంకీర్ణ దళాలు జరిపిన ఈ దాడికి సంబంధించిన వీడియోలు హృదయ విదారకంగా ఉన్నాయి. మరోవైపు, టెలి కమ్యూనికేషన్‌ హబ్‌పై దాడికి సంబంధించిన వీడియోలను విడుదల చేసిన రెబల్స్.. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉందని తెలిపారు.

కాగా, దాడి తర్వాత సాదా ఆసుపత్రి క్షతగాత్రులతో నిండిపోయంది. ఇప్పటి వరకు 200 మంది చేరారు. యూఏఈపై హౌతీలు డ్రోన్ దాడికి పాల్పడిన ఐదు రోజుల తర్వాత ఈ వైమానిక దాడి జరగడం గమనార్హం. హౌతీల డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సౌదీ సారథ్యంలోని సంకీర్ణంలో భాగమైన యూఏఈ 2015 నుంచి హౌతీ రెబల్స్‌తో పోరాడుతోంది. హుడెయిడాలోని యెమెన్ జీవనాధారమైన ఓడరేవుపై జరిగిన దాడి తమ పనేనని ప్రకటించిన సంకీర్ణ దళాలు.. సాదాపై వైమానిక దాడులకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/