గుంటూరులో 8 ఏళ్ల బాలుడిలో మంకీపాక్స్ లక్షణాలు..

గుంటూరులో మంకీపాక్స్ కలకలం రేపింది. ఎనిమిదేళ్ల బాలుడిలో మంకీపాక్స్ లక్షణాలు ఉండడంతో శాంపిల్స్ ను హైదరాబాద్ కు పంపించారు. రెండు వారాల క్రితం గుంటూరు జీజీహెచ్‌కు ఎనిమిదేళ్ల బాలుడ్ని తల్లిదండ్రులు తీసుకొచ్చారు. బాలుడి తల్లిదండ్రులు ఒడిశాకి చెందినవారు కాగా.. ఉపాధి కోసం పల్నాడుకి వచ్చారు. కాగా ఆ బాలుడి ఒంటిమీద దద్దుర్లు కనిపించటంతో ప్రత్యేక వార్డులో ఉంచి బాలుడికి చికిత్స అందిస్తున్నారు జీజీహెచ్‌ వైద్యులు. మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించటం వల్ల బాలుడి శాంపిల్స్‌ను గాంధీ ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు.

దేశంలో మంకీ పాక్స్ కలకలంరేపిన సంగతి తెలిసిందే. ఢిల్లీ, కేరళలో కేసులు కేసులు నమోదైన సంగతి తెలసిందే. ఈ మహమ్మారి మెల్లిగా ఇతర రాష్ట్రాలకూ వ్యాపిస్తోంది. ఇటు కేంద్రం కూడా ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేసింది. మంకీపాక్స్ లక్షణాలు, చికిత్సకు సంబంధించి విధి విధానాలను కూడా ఖరారు చేసింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మరోపక్క స్పెయిన్‌లో మంకీపాక్స్‌ లక్షణాలతో ఒక రోగి మరణించాడు. ఈ విషయాన్ని స్పెయిన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంకీపాక్స్ సోకిన రోగి శుక్రవారం మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మంకీపాక్స్‌కు సంబంధించి అనేక లక్షణాలు ఉంటాయి కాబట్టి, ఏ కారణంతో రోగి మరణించాడో కనుక్కోవాల్సి ఉందన్నారు. మృతుడి పోస్టుమార్టమ్ నివేదిక వచ్చిన తర్వాతే రోగి మరణానికి ‌అసలు కారణం తెలుస్తుంది.