నేడు తెలంగాణలో మోడీ పర్యటన.. పోలీసుల భారీ భద్రత
నేడు తెలంగాణ లో మోడీ పర్యటించనున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)ను జాతికి అంకితం చేయనున్నారు. వీటితో పాటు పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రధాని బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పటు చేసారు.
దాదాపు 3,000 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. సభా ప్రాంగణం, వేదిక, పరిసరాలు ఎస్పీజీ నియంత్రణలోకి వెళ్లాయి. గగనతలంలోనూ ప్రత్యేక హెలీక్యాప్టర్లతో ప్రత్యేక బలగాలు పహారా కాయనున్నాయి. అందుకు నాలుగు హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. సభా వేదిక వద్ద 9 ఎల్ఈడీ స్క్రీన్లు, నగరంలోని పలు కూడళ్ళ వద్ద 75 స్క్రీన్లు ఏర్పాటు ఏర్పాటు చేశారు. మావోయిస్టుల కదలికలతో పోలీసులు అణువణువూ గాలిస్తున్నారు. ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని పలువులు నేతలు హెచ్చరించిన నేపథ్యంలో నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారు.
ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్లో రామగుండం బయల్దేరనున్నారు. 3.05 గంటలకు రామగుండం ఎన్టీపీసీలో హెలిప్యాడ్కు చేరుకుంటారు. 3.10 గంటలకు హెలిప్యాడ్ నుంచి ఆర్ఎఫ్సీఎల్కు మోదీ బయల్దేరుతారు. 3.20 గంటలకు ఆర్ఎఫ్సీఎల్కు ప్రధాని చేరుకుంటారు. 3.35 గంటలకు ఆర్ఎఫ్సీఎల్ నుంచి బయల్దేరుతారు. 3.45 ఎన్టీపీసీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 3.45 గంటల నుంచి 4.40 గంటల మధ్య శిలాఫలకాల ఆవిష్కరణ, ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం చేయనున్నారు. 4.45 గంటలకు సభా వేదిక నుంచి బయల్దేరుతారు. 4.55 హెలికాఫ్టర్ ద్వారా తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.