ఏప్రిల్ 8న హైదరాబాద్ కు ప్రధాని మోడీ రాక

ఏప్రిల్ 08 న ప్రధాని మోడీ హైదరాబాద్ కు రాబోతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. రెండు నెలల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొనాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. అందువల్ల వర్చువల్ వేదికగా సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ రైలును ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలకు రెండో వందే భారత్ రైలును కేంద్రం కేటాయించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో నడిచే ఈ రైలును.. ప్రధాని మోడీ స్వయంగా జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత పార్టీ కార్యక్రమంలోనూ ప్రధాని పాల్గొంటారు.

మోడీ పర్యటనపై హైదరాబాద్ బీజేపీ నేతలతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. పెద్దఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు బీజేపీ నేతలు. ప్రధానిది అధికారిక పర్యటన అయినప్పటికీ పార్టీ తరపున జనసమీకరణ చేయనున్నారు బీజేపీ నేతలు. ప్రస్తుతం తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి ఏపీలోని విశాఖ కు వందేభారత్ రైలు నడుస్తోంది. ఇక ఇప్పుడు సికింద్రాబాద్ -తిరుపతి మార్గంలో మరో రైలు రాబోతుంది. ప్రస్తుతం నారాయణాద్రి రైలు నడుస్తున్న మార్గంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రవేశపెడతారని తెలుస్తోంది. నారాయణాద్రి రైలు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా తిరుపతి వరకు వెళ్తుంది. తిరుపతి వందేభారత్ రైలును మొదటగా నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ రూట్ లోనే నడపనున్నట్లు తెలుస్తోంది.