అవినీతిని తరిమికొడదాం : మోడీ పిలుపు

ఈ ఏడాది తొలి ‘మన్ కీ బాత్’లో ప్రధాని ఆసక్తికర ప్రసంగం

PM Modi speech - Mann Ki Baat
PM Modi speech – Mann Ki Baat

New Delhi: అవినీతి దేశాన్ని గుల్ల చేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. దీన్ని దేశం నుంచి తరిమికొట్టడానికి ప్రజలందరూ కలసికట్టుగా కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ ఏడాదిలో తొలి ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ఆదివారం మోడీ మాట్లాడారు. కోటి మందికి పైగా బాలలు తమ మనసులో మాటను పోస్టు కార్డుల ద్వారా తనకు తెలియజేశారని, ఈ పోస్టు కార్డులు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చాయని, విదేశాల నుంచి కూడా కొన్ని వచ్చాయని తెలిపారు.
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక రాసిన పోస్ట్ కార్డులోని విషయాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ, 2047నాటికి అవినీతి రహిత భారత దేశాన్ని చూడాలని తాను కలలు కంటున్నానని ఆ బాలిక రాసినట్లు తెలిపారు.
అవినీతి రహిత భారత దేశం గురించి మాట్లాడుతున్నారని, అవినీతి అంటే చెద వంటిదని, దీనివల్ల దేశం గుల్ల అవుతుందని అన్నారు. ఈ చెద నుంచి బయటపడటానికి 2047 వరకు ఎందుకు ఆగాలని ప్రశ్నించారు. దేశ ప్రజలు, యువత అందరూ కలిసికట్టుగా చేయవలసిన పని ఇది అని చెప్పారు. విధులు, కర్తవ్యాలను నిర్వహించేందుకు ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యమని తెలిపారు. కర్తవ్య భావన ఉన్నపుడు, కర్తవ్యమే అత్యున్నతమైనది అయినపుడు అవినీతి ఉండదని చెప్పారు. ఇండియా గేట్ వద్ద ఉన్న అమర జవాన్ జ్యోతిని సమీపంలోని జాతీయ యుద్ధ స్మారకంలో విలీనం చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ స్మారకాన్ని ప్రజలు సందర్శించాలని మోడీ కోరారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/