అల్లూరి జయంతి వేడుకల వీడియో ను షేర్‌ చేసిన ప్రధాని

భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మోడీ.. 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌, సినీ నటుడు చిరంజీవి , ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ వేడుకలకు సంబంధించి వీడియోను ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలతో పంచుకున్నారు. కార్యక్రమ ముఖ్యాంశాలను వివరిస్తూ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులు అర్పించడం జరిగిందని మోడీ పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో తెలుగులో తన ప్రసంగాన్ని మొదలు పెట్టి అందరినీ ఆకట్టుకున్నారు మోడీ. అల్లూరి పుట్టిన గడ్డ అంటూ కొనియాడారు.

‘ మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు, తెలుగు వీర లేవరా, దీక్షబూని సాగర, స్వతంత్ర సంగ్రామంలో యావత్ భారతానికి స్పూర్తిగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేల మీద మనం అందరం కలుసుకోవడం మన అదృష్టం’ అంటూ మాట్లాడారు. తెలుగు వీర లేవరా అంటూ శ్రీశ్రీ పాటను ప్రధాని మోడీ గుర్తు చేశారు. ఇదొక పుణ్య భూమి, వీర భూమి అన్నారు. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయ్యిందన్నారు. ఏడాది పాటు వేడుకలు నిర్వహించుకోవాలన్నారు.