‘అటల్​ బ్రిడ్జి’ని ప్రారంభించిన మోడీ

లోని అహ్మదాబాద్​లో సబర్మతి నదిపై నిర్మించిన ‘అటల్​ బ్రిడ్జి’ ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి స్థానికులు అర్పిస్తున్న నివాళి ఈ వారధి అని చెప్పారు. అటల్‌ బ్రిడ్జిపై మోదీతోపాటు గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్‌.పాటిల్‌ కాసేపు సరదాగా నడిచారు. ప్రజలకు అభివాదం చేశారు. అటల్‌ బ్రిడ్జి సబర్మతీ నది రెండు ఒడ్డులను అనుసంధానించడమే కాదు, విశిష్టమైన, వినూత్నమైన డిజైన్‌తో ఆకట్టుకుంటోందని మోదీ అన్నారు. అటల్‌జీని గుజరాత్‌ ఎంతగానో ప్రేమించిందని చెప్పారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన గాంధీనగర్‌ నుంచి పోటీచేసి, రికార్డుస్థాయిలో ఓట్లు సాధించి, ఘన విజయం సాధించారని గుర్తుచేశారు.

ఇది పూర్తిగా ఫుట్​ఓవర్​ బ్రిడ్జి. అంటే నడిచేందుకు మాత్రమే దీనిని కట్టారు. ఎల్లిస్​ బ్రిడ్జి, సర్దార్ బ్రిడ్జిల మధ్య ఈ అటల్​ వారధిని నిర్మించారు. దీని పొడవు 300 మీటర్లు, వెడల్పు 14 మీటర్లు. 2,600 మెట్రిక్​ టన్నుల స్టీల్​ పైపులు వాడి ఈ వారధి కట్టారు. బ్రిడ్జి రూఫ్​ను రంగురంగుల ఫ్యాబ్రిక్​తో తీర్చిదిద్దారు. రెయిలింగ్​ను గ్లాస్​, స్టెయిన్ లెస్​ స్టీల్​తో నిర్మించారు. రివర్​ ఫ్రంట్​లోని పశ్చిమాన ఉన్న ఫ్లవర్​ గార్డెన్​ను తూర్పున త్వరలో నిర్మించే ఆర్ట్స్​ అండ్ కల్చర్​ సెంటర్​తో ​ఈ బ్రిడ్జి కలుపుతుంది. పాదచారులతో పాటు సైక్లిస్టులు కూడా నదిని దాటేందుకు, ట్రాఫిక్​ బారి నుంచి తప్పించుకునేందుకు ఈ వారధిని వాడుకోవచ్చు. అలాగే బ్రిడ్జిపై నిలబడి నది మధ్యలో నుంచి నదిని, పరిసర ప్రాంతాలను కూడా చూడవచ్చు. లోయర్, అప్పర్​ వాక్​వేస్​ల నుంచి చేరుకునేలా ఈ బ్రిడ్జిని నిర్మించారు.