బండి సంజయ్ అరెస్ట్ ఫై ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా కీలక మంతనాలు..

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ ఫై ప్రధాని మోడీ , అమిత్ షా, జేపీ నడ్డా తో పాటు పలువురు బిజెపి నేతలు అరా తీస్తున్నారు. ప్రధాని మోడీతో అమిత్ షా, జేపీ నడ్డా భేటీ అయ్యారు. మోడీతో భేటీ అనంతరం విడిగా నడ్డా, షా సమావేశమయ్యారు. బండి సంజయ్ అరెస్టు, తెలంగాణలో పరిస్థితుల గురించి ఇద్దరు చర్చించినట్లు తెలుస్తోంది.

అలాగే బండి సంజయ్ అరెస్ట్ ఫై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి స్పందించారు. తెలంగాణాలో ఐపిసి కోడ్ నడవడం లేదు.. కేపిసి కోడ్ నడుస్తుందన్నారు. కేసీఆర్ పై తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయింది.. అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులకు లోక్ సభ స్పీకర్ నుంచి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు వస్తాయి.. కేసీఆర్ పొలిటికల్ డిగ్రీ సర్టిఫికేట్ అడిగినందుకు అరెస్ట్ చేశారా ? అంటూ ప్రశ్నించారు. ఈరోజు గవర్నర్ ని కలిసి వినతపత్రం అందిస్తామన్నారు.

తెలంగాణ లో TSPSC పేపర్ లీక్ వ్యవహారం కొనసాగుతున్న తరుణంలోనే తాజాగా పదో తరగతి పేపర్స్ లీక్ అవుతుండడం తో సంచలనంగా మారింది. ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో బిజెపి నేతల హస్తం ఉందని బిఆర్ఎస్ ఆరోపిస్తుంది. అందులో భాగంగానే పోలీసులు బండి సంజయ్ ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అర్ధరాత్రి బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ముందుగా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం పది గంటల ప్రాంతంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మధ్య ఆయన్ను పాలకుర్తి ప్రభుత్వ హాస్పటల్ కు తీసుకొచ్చారు. అనంతరం ఆయన్ను డాక్టర్స్ పరీక్షలు చేసారు. ప్రస్తుతం సంజయ్ ని హన్మకొండ మేజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్తున్నారు.