ఈ ఏడాది చివరికి కరోనా వ్యాక్సిన్‌..అమెరికా సంస్థలు

వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన మోడెర్నా, ఫైజర్ సంస్థలు

Moderna-Has-Started-Phase 3-Corona-Vaccine-Trials

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి వ్యాక్సిన్‌ కోసం ప్రపంచదేశాలు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే అమెరికాకు చెందిన మోడెర్నా, ఫైజర్ సంస్థలు కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. మరో మూడు నెలల్లో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఆయా సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ల మానవ పరీక్షలు తుదిదశకు చేరుకున్నాయి. తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ విజయవంతమైతే ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి రెగ్యులేటరీ అనుమతులు పొంది ఈ ఏడాది చివరినాటికి 5 కోట్ల మందికి రెండేసి డోసుల వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని ఫైజర్ సంస్థ తెలిపింది.

ఈ ఏడాది నవంబర్‌ నాటికే తమ వ్యాక్సిన్‌ సరఫరా ప్రారంభమవుతుందని స్పష్టతనిచ్చింది. వచ్చే ఏడాది చివరినాటికి మొత్తం130 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల సరఫరా చేయడానికి ఫైజర్‌ ప్రణాళికలు వేసుకుంటోంది. కాగా, మరోవైపు మొడెర్నా సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ తుది దశకు చేరుకుంది. 2021 నుంచి ఏడాదిలోగా 100 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది. మొడెర్నా, ఫైజర్‌ సంస్థలు మొత్తం 30,000 మందిపై మానవ పరీక్షలను ఇప్పటికే ప్రారంభించాయి. మోడెర్నా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి. ఆ సంస్థకు అమెరికా ప్రభుత్వం రూ.7500 కోట్ల నిధులు సమకూర్చింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/