ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దుః ఎమ్మెల్సీ క‌విత‌

సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తూ ప్రజలకు కుటుంబ పెద్దలా అండగా ఉంటున్నారని వ్యాఖ్య

kavitha

హైదరాబాద్‌ః గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలుకురుస్తున్నాయి. దీంతో వ‌ర‌ద‌ల‌పై సీఎం కేసీఆర్ నిరంత‌రం సమీక్షిస్తున్నార‌ని ఎమ్మెల్సీ క‌విత తెలిపారు. ఈ మేర‌కు ఆమె ట్వీట్ చేశారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె గురువారం పలు ట్వీట్లు చేశారు.

‘‘రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలపై‌ సీఎం కేసీఆర్ గారు నిరంతరం సమీక్షిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు అందిస్తూ కుటుంబ పెద్దలా అండగా నిలుస్తున్నారు.

ప్రసవానికి వారం గడువున్న గర్భిణులను కూడా ముందుగానే ఆస్పత్రులకు తరలించి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. వరద ప్రాంతాల్లో వైద్యం, విద్యుత్, తాగునీటి వసతులకు ఎలాంటి అవాంతరాలు రాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నలా వ్యవహరిస్తున్నారు.

ఒకవైపు ప్రభుత్వం మరోవైపు టీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆహారం పంపిణీ చేస్తూ ప్రజలకు ధైర్యాన్ని ఇస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా..” అని కవిత వరుసగా ట్వీట్లు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/