ఈడీ నోటీసుల ఫై ఎమ్మెల్సీ కవిత క్లారిటీ

ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఈ స్కామ్ ఫై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని సుమారు 40 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీతో పాటు పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని ఆయా ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారులు 25 బృంధాలు ఏర్పడి ఈరోజు కూడా బెంగళూరు, చెన్నై, నెల్లూరు, హైదరాబాద్‌లోని పలువురి ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు.

గతంలో హైదరాబాద్‌లో రెండుసార్లు తనిఖీ చేసిన అధికారులు.. ఈరోజు మూడోసారి సోదాలు నిర్వహించారు. ఈ తరుణంలో ఎమ్మెల్సీ కవిత కు ఈడీ నోటీసులు ఇచ్చారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ఆ వార్తల ఫై కవిత క్లారిటీ ఇచ్చారు. తనకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు. కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇక హైదరాబాద్ లో ఈడీ సోదాల విషయానికి వస్తే..గతంలో కోకాపేటలోని రామచంద్ర పిళ్లై ఇల్లు, నానక్‌రామ్‌గూడలోని ఆఫీస్‌లలో సోదాలు చేసిన ఈడీ.. ఇప్పుడు రాయదుర్గంలో తనిఖీలు చేపట్టింది. బీజేపీ నేతలు ఢిల్లీలో స్టింగ్ ఆపరేషన్ వీడియోలు మీడియాకు రిలీజ్ చేసిన మరుసటి రోజే ఈడీ సోదాలు చేపడుతోంది. రాబిన్ డిస్టలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్ ఎల్.ఎల్.పి. పేరుతో రామచంద్ర పిళ్లై కంపెనీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీల్లో అభిషేక్ బోయిన్‌పల్లి, గండ్ర ప్రేమ్‌సాగర్‌రావు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. మూడు నెలల క్రితం మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఈడీ అరెస్టు చేసింది. విచారణ సందర్భంగా ఆయన తెలిపిన సమాచారం మేరకు లిక్కర్‌ స్కామ్‌లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.