ఆటా 17వ మహాసభల్లో పాల్గొనబోతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరిగే అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొనబోతున్నారు. మహాసభల్లో భాగంగా జరిగే యువజన సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆటా ప్రతినిధులు ఆమెను ఆహ్వానించారు. జూలై 2న ఆటా మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారు. ఆ రోజు మధ్యాహ్నం తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం ప్రవాస తెలుగు వారు పాల్గొనే సభలో ఆమె ప్రసంగించనున్నారు. సాయంత్రం 8 గంటలకు, దాదాపు 10వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ప్రైమ్‌ మీట్‌కు ఆమె అతిథిగా హాజరవుతారు.

అనంతరం బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఆమె ఆవిష్కరిస్తారు. ప్రతి సంవత్సరం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ వేడుకలను ఈ సారి మరింత పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్టు ఆటా ప్రతినిధులు తెలిపారు. ఇన్నేళ్లు జరిగిన మహాసభలు ఒక ఎత్తైతే.. ఈ ఏడాది జరగబోయేవి తమకు ప్రత్యేకమన్నారు. ఆనందాలు, బాధలు, విజయాలు, అవకాశాలు పంచుకునే వేదికగా ఇది మారబోతోందని తెలిపారు. మహాసభ ఏర్పాట్ల కోసం 80 కమిటీలు శ్రమిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.