పేపర్ లీక్ ఘటనతో ఆత్మహత్య చేసుకున్న నవీన్ కుటుంబాన్ని పరామర్శించిన జీవన్ రెడ్డి

ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల నేపథ్యంలో గ్రూప్ -1 పరీక్షను రద్దు చేస్తున్నట్లు TSPSC ప్రకటించడం తో మనస్థాపానికి గురై సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ కు చెందిన చిటికెన నవీన్ (32) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నవీన్ కుటుంబ సభ్యులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు. ఉపాధి లేకపోవడం వల్లే నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని , కనీసం ప్రైవేటు సెక్టార్ లోనైనా ఉద్యోగాలు కల్పిస్తే నిరుద్యోగుల ఆత్మహత్యలను నివారించవచ్చునని జీవన్ రెడ్డి అన్నారు.

TSPSC లీకేజీపై సీబీఐతో విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయని ఈ సందర్బంగా ఆయన అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం బాధకరమన్నారు. మరోవైపు నవీన్ కుటుంబాన్నిYSRTP అధ్యక్షురాలు షర్మిల సైతం పరామర్శించారు. ఉద్యోగాల భర్తీ లేకపోవడం వల్లే నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని షర్మిల అన్నారు. రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగమని చెప్పిన కేసీఆర్.. ఒక్క ఉద్యోగమైన ఇచ్చాడా అని ప్రశ్నించారు. TSPSC లో స్కామ్ జరిగితే తనకేం సంబంధం లేదని మంత్రి కేటీఆర్ చెప్పడం సిగ్గుచేటు అని అన్నారు.