మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే సీతక్క

మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు కు ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో మూడు నెలల్లో ఉప ఎన్నిక జరగబోతుందనే నేపథ్యంలో అన్ని పార్టీ లు ఉప ఎన్నిక ఫై ఫోకస్ పెట్టాయి. కాంగ్రెస్ కు రాజీనామా చేసి బిజెపి లో చేరబోతున్న రాజగోపాల్..బిజెపి నుండి ఉప ఎన్నిక బరిలో దిగుతున్నాడు.

ఈ క్రమంలో అన్ని పార్టీ లు సభలు , సమావేశాలతో బిజీ బిజీ గా ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మునుగోడు ఉపఎన్నిక, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై స్పందించారు. స్వప్రయోజనాల కోసమే రాజగోపాల్​రెడ్డి పార్టీ మారారు తప్ప.. నియోజకవర్గాల ప్రజల కోసం కాదని ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మునుగోడు నియోజకవర్గ ఇంఛార్జ్ సీతక్క పాల్గొని.. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎనిమిదేళ్లుగా ఏడడుగుల బంధంలా నడిచిన బిజెపి, టిఆర్ఎస్ .. ఇప్పుడు ఓట్ల కోసం నాటకాలాడుతున్నాయని సీతక్క ఆరోపించారు.

తెలంగాణ ఇవ్వడం అంటే.. తల్లిని చంపి బిడ్డను ఇచ్చినట్లు అన్న మోడీ.. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కోసం ఓట్లు ఎలా అడుగుతారని సీతక్క మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే రాజగోపాల్​రెడ్డి పార్టీ విడిపోయేవారా..? అని ఆమె ప్రశ్నించారు. మునుగోడు అంటే కాంగ్రెస్ అడ్డా అని ఉద్ఘాటించిన సీతక్క.. వచ్చే ఉప ఎన్నికలో పార్టీని గెలిపించి నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని కార్యకర్తలకు సూచించారు.