ఏపీలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్

నేటి నుంచి నామినేషన్లు..ఈ నెల 23న పోలింగ్

mla-quota-mlc-elections-notification-released

అమరావతిః ఏపీ శాసనమండలిలో ఈ నెలాఖరుకు ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్సీలు నారా లోకేశ్, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్, గంగుల ప్రభాకర్ రెడ్డి, పెన్మత్స సూర్యనారాయణరాజు, చల్లా భగీరథరెడ్డి, పోతుల సునీతల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. వీరిలో చల్లా భగీరథరెడ్డి గతేడాది నవంబరులో కన్నుమూయగా, బచ్చుల అర్జునుడు కొన్నిరోజుల కిందటే మృతి చెందారు. ఈ నేపథ్యంలో, మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల చేశారు.

.ఈ నెల 6 నుంచి 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ. సెలవు దినాలు మినహా మిగతా పని దినాల్లో నామినేషన్ల స్వీకరణ
.ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్న అధికారులు.
.అభ్యర్థి స్వయంగా గానీ, తన ప్రతిపాదకుడి ద్వారా గానీ నామినేషన్ల దాఖలు చేసేందుకు అవకాశం.
.వెలగపూడిలోని అసెంబ్లీ భవనంలో నామినేషన్ల దాఖలు. రిటర్నింగ్ అధికారి/ సహాయ రిటర్నింగ్ అధికారి/ శాసనమండలి ఉప కార్యదర్శికి నామినేషన్లు సమర్పించే అవకాశం.
.ఈ నెల 14న ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన.
.ఈ నెల 16 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు.
.ఈ నెల 23న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ భవనంలో పోలింగ్. పోటీ ఉంటేనే ఎన్నికలు… లేకపోతే ఏకగ్రీవం అయినట్టు ప్రకటన.
.అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.