ఈడీ విచారణకు రాలేను..మరింత సమయం కావాలిః ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

వచ్చే నెల 25 వరకు టైమివ్వాలని ఈడీ ఆఫీసుకు లేఖ

mla-pilot-rohit-reddy-not-attending-enforcement-directorate-enquiry

హైదరాబాద్‌ః బిఆర్ఎస్ నేత, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈరోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకాలేదు. అధికారులు అడిగిన డాక్యుమెంట్లు సేకరించడం పూర్తికాలేదని చెబుతూ..అయ్యప్ప మాలలో ఉన్నందున సంక్రాంతి తర్వాత విచారణకు వస్తానని.. తనకు మరింత సమయం కావాలని ఆయన కోరారు. ఈమేరకు ఆయన ఈడీ అధికారులకు లేఖ రాసి వ్యక్తిగత సహాయకుడితో పంపారు. బ్యాంకుకు వరుస సెలవుల నేపథ్యంలో తన ఖాతాకు సంబంధించిన స్టేట్ మెంట్లు తీసుకోలేక పోయానని అందులో పేర్కొన్నారు. వచ్చే నెల 25 వరకు టైమివ్వాలని పైలట్ రోహిత్ రెడ్డి కోరారు. దీనిపై ఈడీ అధికారులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

కాగా, కర్ణాటక డ్రగ్స్ కేసులో విచారణకు రావాలంటూ పీఎంఎల్ఏ కింద తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు పంపించింది. ఈరోజు (సోమవారం) హైదరాబాద్ లోని ఈడీ ఆఫీసుకు రావాలని ఆ నోటీసులలో సూచించింది. ఉదయం వరకూ రోహిత్ రెడ్డి విచారణకు హాజరవుతారనే అంతా భావించారు. అంతకుముందు తన న్యాయవాదితో ఈడీ నోటీసులపై రోహిత్ రెడ్డి చర్చలు జరిపారు. అనంతరం పదకొండు గంటలకు తాను విచారణకు రాలేనంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ అధికారులకు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/