పవన్ కల్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే రజనీని చంద్రబాబు రంగంలోకి దించారుః కొడాలి నాని

రజనీకాంత్‌ సిగ్గు శరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నారన్న కొడాలి నాని

kodali nani as ap state development board chairman
mla-kodali-nani-sensational-comments-on-rajinikanth

అమరావతిః దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్‌సిపి నేత, మాజీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. రజనీకాంత్‌ సిగ్గు శరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నారని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే రజనీకాంత్ ను చంద్రబాబు రంగంలోకి దించారని కొడాలి నాని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు రాజకీయాలను పవన్‌ కల్యాణ్‌ తెలుసుకోవాలని, ఏది మంచో ఏది చెడో గ్రహించాలని హితవు పలికారు.

‘‘ఎన్టీఆర్ పై చెప్పులు విసురుతుండగా.. వైస్రాయ్ హోటల్ లో చంద్రబాబుకు రజనీ మద్దతు తెలిపారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ను పొగడడం సిగ్గుచేటు. వెధవలంతా ఒకచోట చేరి చేస్తున్న ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ప్రజలెవరూ పట్టించుకోవడం లేదు’’ అని తీవ్ర విమర్శలు చేశారు. మూడు రోజులు షూటింగ్ చేస్తే నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండే రజనీకాంత్ తెలుగు ప్రజలకేం చెప్తారని కొడాలి నాని మండిపడ్డారు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదువుతూ రజనీకాంత్ మరింత దిగజారుతున్నారని విమర్శలు చేశారు. ఏపీ రాజకీయాలపై అవగాహన లేకుండా మాట్లాడారని అన్నారు. యుగపురుషుడు ఎన్టీఆర్ జీవించి ఉన్నప్పుడు ఆయన పట్ల రజనీకాంత్ ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసన్నారు.