హిందూపురం నుంచి బాలకృష్ణ ర్యాలీ
సత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురం ఉండాలని డిమాండ్
అనంతపురం: ఏపీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల్లో భాగంగా సత్యసాయి జిల్లాలో తన నియోజక వర్గం హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు మౌన దీక్షకు దిగనున్నారు. మౌన దీక్ష చేయడానికి హిందూపురం నుంచి ఆయన ర్యాలీగా బయలుదేరారు.
పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరుగుతోంది. అంబేద్కర్ విగ్రహం వద్దే బాలకృష్ణ మౌన దీక్షకు దిగుతారు. బాలకృష్ణ వెంట పలువురు స్థానిక నేతలు ఉన్నారు. అలాగే, విద్యార్థులు, ప్రజా సంఘాలు భారీగా తరలిరావడంతో అక్కడ తోపులాట జరిగి, స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. జై బాలయ్య నినాదాలతో యువకులు హోరెత్తిస్తున్నారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా వారు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/