అవాస్తవాలను ప్రచారం చేయవద్దు
కియా మోటార్స్ రాష్ట్రంలోనే ఉంటుంది
అమరావతి: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతుందంటూ టిడిపి ఎంపీ జయదేవ్ గల్లా చేసిన ప్రచారాన్ని వైఎస్సార్సిపి పార్టీ లోక్సభా పక్షనేత, రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉండి ఇలాంటి అవాస్తవాలను ఎందుకు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కియా మోటార్స్ రాష్ట్రంలోనే ఉంటుందని ఆ సంస్థ ఎండీ స్పష్టం చేసిన విషయాన్ని ట్విటర్ వేదికగా జయదేవ్కు గుర్తుచేశారు.
టిడిపి లోక్సభా వేదికగా చేసిన దుష్ప్రచారానికి ఇదే సమాధానం అంటూ కియా ఎండీ చేసిన ప్రకటనకు సంబంధించిన వార్తా కథనాన్ని జోడించారు. ఏపీలో ఉన్న పెట్టుబడిదారులను తరిమేయాలని ఎందుకంత తొందర మీకు? ఎవరు బాధ్యతరాహిత్యంతో ప్రవర్తిస్తున్నారో ఇప్పటికైనా అర్థమైందా. కియా మోటార్స్ రాష్ట్రం నుంచి తరలిపోవడం లేదని ఆ సంస్థ సమాధానం ఇచ్చింది. ఒక ఎంపీగా ఉండి అసత్యాలు ప్రచారం చేస్తావా? అయినా నీ నుంచి ఇంతకన్నా ఎక్కువ ఏం
ఆశించగలం అని మిథున్రెడ్డి ట్వీట్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/