టిడిపి నేత పట్టాభిపై దాడి
డీజీపీ వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్
విజయవాడ: టిడిపి అధికార ప్రతినిధి పట్టాభిపై విజయవాడలో దాడి జరిగింది. దాదాపు 10 మంది దుండగులు దాడికి పాల్పడ్డారు. పట్టాభి తన ఇంటి నుంచి కార్యాలయానికి బయల్దేరగానే రాడ్లతో ఆయన కారును దుండగులు ధ్వంసం చేశారు. దీంతో కారులో ఉన్న పట్టాభికి కూడా గాయాలయ్యాయి. దుండగులు రాడ్లతో దాడి చేశారని పట్టాభి తెలిపారు. అలాగే, తన డ్రైవర్ను కూడా వారు గాయపరిచారని తెలిపారు.
దాడులు చేసినప్పటికీ, భయపడనని, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటానని చెప్పారు. తనపై జరిగిన దాడి పట్ల డీజీపీ వచ్చి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 6 నెలల క్రితం కూడా తన కారుపై దాడి జరిగిందని, అయినప్పటికీ ఆ దాడిపై ఇప్పటికీ చర్యలు లేవని అన్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను బయటపెడుతున్నందుకే తనపై దాడులు చేస్తున్నారని పట్టాభి అంటున్నారు. ఏపీలో శాంతిభద్రలు ఎలా దిగజారిపోయాయో ప్రజలు ఆలోచించుకోవాలని ఆయన చెప్పారు. వైఎస్ఆర్సిపి నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/