పార్లమెంట్ లో ప్రధాని వ్యాఖ్యలు అసంబద్ధమైనవి: తలసాని

తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి రాష్ట్రంగా మార్చే కుట్ర.. మంత్రి

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి రాష్ట్రంగా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేసిందని మంత్రి తలసాని శ్రీనివాయస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపాన్ని పాలతో శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహమూద్ అలీ, MLC ప్రభాకర్, MLA లు మాగంటి గోపినాధ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించ పరిచేలా ప్రధాని వ్యాఖ్యలు చేశారని అన్నారు. పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవి అని చెప్పారు.

గుజరాత్ కంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పాల్సిందే అని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్ట్ అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటే కుక్కల్లా మోరిగిన బీజేపీ నేతలు.. ప్రధాని వ్యాఖ్యలపై ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. ప్రధాని క్షమాపణలు చెప్పే వరకు బీజేపీ నేతలను అడ్డుకుంటామని మంత్రి తలసాని హెచ్చరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/