మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట్లో విషాద ఛాయలు

తెలంగాణ రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. సత్యవతి రాథోడ్ మాతృమూర్తి గుగులోతు దస్మి (86) కన్నుమూశారు. పది రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను హైదరాబాద్‌లోని యశోద దవాఖానలో చేర్పించారు. కాగా, చికిత్స పొందుతూ..శుక్రవారం గుండె పోటుతో దస్మి మృతి చెందారు. దస్మి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సత్యవతి రాథోడ్ కుటుంబానికి సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

అలాగే మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సంతాపం ప్రకటించారు. మంత్రి సత్యవతికి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ చేశారు. ఆమె తో మాట్లాడి వారి తల్లి మరణానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆమెను ఓదార్చి, మనోధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ.. దస్మి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. మహబూబాద్ జిల్లా కురవి మండలం లోని పెద్ద తండాలో దస్మి అంతక్రియలు నిర్వహించినట్లు తెలుస్తోంది.