ఎమ్మెల్సీ ఫలితాలపై మంత్రి రోజా స్పందన

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లిన్ స్వీప్ చేసి సంబరాలు చేసుకుంటుంది. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అవుతుందని టీడీపీ నేతలు చెపుతున్నారు. ఈ తరుణంలో ఈ ఫలితాలపై మంత్రి రోజా స్పందించారు. సింబల్ పై జరిగే ఎలక్షన్లలో జగన్ కు తిరుగులేదని స్పష్టం చేశారు. 2024లోనూ ప్రజాతీర్పు తమకు అనుకూలంగా వస్తుందని రోజా ధీమా వ్యక్తం చేశారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని హెచ్చరించారు.

పులివెందులలో జగన్ ఓడించే వారు ఇంకా పుట్టలేదని, వై నాట్ అంటున్న వారు దమ్ముంటే పులివెందుల వచ్చి పోటీ చేయాలన్నారు. చంద్రబాబు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు రాజీనామా చేసి ఎన్నికల్లోకి వస్తారా? అని రోజా సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామని చెప్పుకుంటూ శునకానందం పొందుతున్నారని రోజా టీడీపీ నేతలపై వ్యంగ్యం ప్రదర్శించారు. ఇప్పుడు ఓటు వేసింది సైకిల్ గుర్తుపై కాదన్న విషయం టీడీపీ నేతలు గ్రహించాలని హితవు పలికారు.