రైతుల ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వచ్చాం: మంత్రి నిరంజన్‌ రెడ్డి

న్యూఢిల్లీ: ఖరీఫ్‌ సీజన్‌లో పండే ప్రతిగంజా కొనుగోలు చేస్తామని.. కేంద్రమంత్రులు చెబుతున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. అయితే ప్రకటనలు కాకుండా లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కోటి 30 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా ఉందన్నారు. కేంద్రం ఇచ్చిన టార్గెట్‌ను పెంచాలని గతంలోనే కోరామని తెలిపారు. తెలంగాణలో వరి ధాన్యం కోసం 6 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వచ్చామని చెప్పారు. కేంద్రమంత్రి అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురు చూస్తున్నామని… వీలైనంత త్వరగా సమయం ఇచ్చి తమ గోడు వినాలని కోరారు. తమను నిరీక్షించేలా చేయడమంటే రైతులను అవమానించడమే అని మంత్రి అన్నారు. కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని విమర్శించారు. తెలంగాణలో 5 లక్షల ఎకరాల్లో వరి కోతకు సిద్ధంగా ఉందని చెప్పారు. రాబోయే ధాన్యాన్ని కేంద్రం కొంటుందో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. జనవరి 15 వరకు వరి కోతలు ఉంటాయని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/