సిరిసిల్లలో అందర్నీ ఆశ్చర్యపరిచిన మంత్రి కేటీఆర్

బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్..సిరిసిల్ల లో అందర్నీ ఆశ్చర్యపరిచారు. స్వయంగా తానే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి ప్రజలను షాక్ లో పడేసాడు. కేటీఆర్ సొంతంగా కారు డ్రైవింగ్ చేయడం చూసి బీఆర్‌ఎస్ కార్యకర్తలు, ప్రజలు కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు.

సిరిసిల్ల నియోజకవర్గంలో తాజాగా కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో సెస్ కార్యాలయానికి సొంతంగా కారు నడుపుకుంటూ వెళ్లారు. దీంతో కేటీఆర్‌ను చూసి ప్రజలు, అధికారులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అవాక్కయ్యారు. సిరిసిల్లలో ఇటీవల జరిగిన సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయడంకా మోగించిన సంగతి తెలిసిందే. దీంతో విజయం సాధించిన అభ్యర్థులకు అభినందనలు తెలిపిన కేటీఆర్.. సెస్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పద్మనాయక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.

అలాగే తంగళ్లపల్లిలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. బోయిన్‌పల్లి మండలం కొదురుపాకలో ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ పర్యటనలో రాజన్న-సిరిసిల్ల మండల కొత్త డీఐజీ రమేష్ నాయుడు కేటీఆర్‌ను కలిశారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు.