ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సుకు మంత్రి కేటీఆర్

వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 21 వరకు దావోస్ సదస్సు
ఆహ్వానించిన వేదిక అధ్యక్షుడు బోర్గ్ బెండె

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సుకు హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయనకు ఆర్థిక వేదిక అధ్యక్షుడు బోర్గ్ బెండె నుంచి లేఖ అందింది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 21వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లో ఈ సదస్సు జరగనుంది. తెలంగాణను సాంకేతికంగా రారాజుగా తీర్చిదిద్దడం, మహాశక్తి కేంద్రంగా నిలపడంలో కేటీఆర్ కృషి ఎనలేనిదని బోర్గ్ ఆ లేఖలో కొనియాడారు. కరోనా నుంచి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకోవడానికి కేటీఆర్ నాయకత్వం దార్శనికతను చూపించిందని ప్రశంసించారు. ఆయన కృషికి గుర్తింపుగానే ఈ వార్షిక సదస్సుకు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.

అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతోపాటు వాటిని ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం, సామర్థ్యం పెంపుదల, సహకార మార్గాలపై కేటీఆర్ తన అభిప్రాయాలను వార్షిక సదస్సులో పంచుకోవాలని బోర్గ్ కోరారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనాలంటూ తనకు అందిన ఆహ్వానంపై కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రపంచస్థాయి సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు అనువుగా మార్చుకుంటామని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/