టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు శుభాకాంక్షలు: కేటీఆర్
ప్రతి ఎన్నికలోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తోంది..మంత్రి కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. ఇందులో ఘన విజయం సాధించడం పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న ప్రతి ఎన్నికలోనూ టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తూ వస్తోందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల సాకారం కోసం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పాలనకు, ప్రజలు ప్రతి ఎన్నికలోనూ పట్టం కడుతున్నారన్నారని చెప్పారు.
తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ 12 స్థానాలకు 12 స్థానాలనూ టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం ద్వారా టీఆర్ఎస్ పార్టీ అంటే ‘తిరుగులేని రాజకీయ శక్తి’ అని మరోసారి నిరూపితమైందని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అనేక వినూత్న కార్యక్రమాలతో స్థానిక సంస్థలు ఎంతగానో బలోపేతమయ్యాయని, ముఖ్యంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా స్థానిక సంస్థలకు ప్రతినెల నిధులను అందిస్తూ స్థానిక సంస్థలను ఆర్థికంగానూ బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి కార్యక్రమాల ఫలితంగానే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఘనమైన విజయం అందించారన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులు అందరికీ అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. అలాగే, ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించిన స్థానిక సంస్థల ప్రతినిధులు అందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/