ప్రారంభమైన శాసన మండలి ప్రత్యేక సమావేశం
హైదరాబాద్ వర్షాలపై మాట్లాడిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. నిన్న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలపై బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో నాలుగు చట్ట సవరణ బిల్లులను ఈ రోజు శాసనమండలిలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. శాసనమండలిలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో వర్ష బీభత్సం గురించి ప్రస్తావించారు. ఆకాశానికి చిల్లులు పడుతున్నాయా? అన్నట్లు వర్షాలు పడుతున్నాయని ఆయన చెప్పారు. వర్షాలపై తెలంగాణ సిఎం కెసిఆర్ నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. అన్ని విభాగాలను తాము అప్రమత్తం చేశామని కెటిఆర్ చెప్పారు. హెలికాప్టర్లను కూడా సిద్ధం చేశామని వివరించారు. ఈ రోజు, రేపు సెలవులు ప్రకటించామని తెలిపారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ముంపునకు గురైన వారిని క్యాంపులకు తరలిస్తున్నామని చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/