ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది

minister-ktr

హైదరాబాద్‌: రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కెటిఆర్‌ న‌గ‌రంలోని సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ‌్రేట‌ర్ ప‌రిధితో పాటు శివారు ప్రాంతాల్లో కెసిఆర్‌ సిఎం అయ్యాక వాయువేగంతో తాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించామ‌ని అన్నారు. పెట్టుబడులు రావని ప్రచారం చేశారని, ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఒక‌ప్పుడు ఫిబ్ర‌వ‌రి, మార్చి వ‌చ్చిందంటే వంద‌లాది మంది మ‌హిళ‌లు ఖాళీ బిందెల‌తో నిర‌స‌న‌లు చేప‌ట్టేవారు. 14 రోజుల‌కు ఒక‌సారి మంచినీళ్లు వ‌చ్చే దుస్థితి. ఇప్పుడు కెసిఆర్ వ‌చ్చిన త‌ర్వాత మంచినీటికి ఇబ్బందులు లేకుండా చేశామ‌న్నారు. రూ. 2 వేల కోట్ల పైచిలుకు ఖ‌ర్చు పెట్టి న‌గ‌ర ప్ర‌జ‌ల‌తో పాటు శివారు ప్రాంతాల‌కు సుర‌క్షిత మంచినీరు అందించామ‌న్నారు.

1920లో గండీపేట‌, మ‌ళ్లీ వందేళ్ల త‌ర్వాత 2020లో కేశావ‌పురం రిజ‌ర్వాయ‌ర్ క‌డుతున్నాం. ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తెలిసిన నాయ‌కుడు కాబ‌ట్టే ఇప్పుడు తాగునీటి తండ్లాట లేదు. 90 శాతం తాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించామ‌ని స్ప‌ష్టం చేశారు. కెసిఆర్ సిఎం అయ్యాక వాయువేగంతో తాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించామ‌ని కెటిఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో 3,200 స్వచ్ఛ ఆటోలు పనిచేస్తున్నాయని, గతంలో వారానికి 2 రోజులు పవర్‌ హాలిడేలు ఉండేవని గుర్తు చేశారు. ఇప్పుడు పరిశ్రమలకు 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/