మేడ్చల్లో సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్లో లక్ష మందికి సీపీఆర్ శిక్షణ ఇవ్వాలి.. మంత్రి కెటిఆర్

హైదరాబాద్ః మంత్రి కెటిఆర్ మేడ్చల్ జిల్లాలో సీపీఆర్ శిక్షణను ప్రారంభించారు. అనంతరం కెటిఆర్ మాట్లాడారు. హైదరాబాద్ మహా నగరంలో లక్ష మందికి సీపీఆర్ శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. జిల్లాల్లో వందల మందికి ఈ శిక్షణ ఇవ్వాలన్నారు. ఇటీవల కాలంలో నాన్ కమ్యూనికేబుల్ రోగాలు అధికంగా వస్తున్నాయని కెటిఆర్ తెలిపారు. దాంట్లో అతి ముఖ్యమైనది సడెన్ కార్డియాక్ అరెస్ట్. సోషల్ మీడియాలో ఒక ఆశ్చర్యకరమైన వీడియోను చూశాను. మొన్న ఓ పిల్లోడు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. జిమ్లో వర్కవుట్ చేస్తూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని కేటీఆర్ తెలిపారు. ఆ ప్రదేశాల్లో సీపీఆర్ శిక్షణ పొందిన వారు ఉంటే వారి ప్రాణాలను కాపాడేవారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, మాల్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో సీపీఆర్ శిక్షణ పొందిన వారిని నియమించాలన్నారు. లైఫ్ స్టైల్ ఛేంజెస్ వల్ల ఈ రోగాలు చుట్టుముడుతున్నాయి. సీపీఆర్ను నేర్పించగలిగితే చాలా వరకు సడెన్ కార్డియాక్ అరెస్టును తగ్గించొచ్చు. రక్త ప్రసరణ ఆగిపోకుండా ప్రాథమికంగా ఆ వ్యక్తిని కాపాడుకోవచ్చు అని కెటిఆర్ సూచించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ బ్రహ్మాండంగా ముందుకు పోతోందని కెటిఆర్ ప్రశంసించారు. ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఒక వైపు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వరంగల్లో 2 వేల పడకల ఆస్పత్రి నిర్మిస్తున్నాం. బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు ఏర్పాటు చేశాం. ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నాం. కంటి వెలుగు కార్యక్రమం అద్భుతంగా విజయవంతమైంది. వైద్య వ్యవస్థ మీద విశ్వాసాన్ని పెంచాం. మాతా శిశు మరణాలు తగ్గాయి. ఇలా అద్భుతంగా ముందుకు పోతున్నాం. కొత్తగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అన్ని వర్గాల విద్యార్థులకు వైద్య విద్యలో అవకాశాలు కల్పిస్తున్నాం అని కెటిఆర్ తెలిపారు.