హైదరాబాద్ నగరంలో అద్భుతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది : మంత్రి కేటీఆర్

హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు రాయదుర్గంలోని మైహోం ట్విట్జాలో కొలియర్స్, ష్యూరిఫై సంస్థల కార్యాలయాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. భాగ్యగనరంలో కొవిడ్ వల్ల హైబ్రిడ్ విధానంలో పనిచేస్తున్నా.. ఫలితాలు మాత్రం ఎక్కడా తగ్గట్లేదని కేటీఆర్ అన్నారు. ఐటీ కార్యకలాపాలు హైదరాబాద్‌కే పరిమితం కాదని.. టైర్-2 సిటీలో కూడా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొలియర్స్ కంపెనీ కూడా టైర్-2 సిటీల్లో ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. ఏడేళ్ల క్రితం ష్యూరిఫై సంస్థలో ఒక ఉద్యోగి మాత్రమే ఉంటే.. ఇప్పుడు 200 మంది ఉన్నారని తెలిపారు. తెలంగాణ పోటీ బెంగళూరుతో కాదని.. సింగపూర్, మలేసియా దేశాలతో అని కేటీఆర్ అన్నారు.

ఎనిమిదేళ్లలోనే సింగపూర్‌ స్థాయికి హైదరాబాద్‌ను తీసుకురావడంలో కేటీఆర్ పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కేటీఆర్ ముందు చూపు వల్లే భాగ్యనగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం ఇక్కడ ఎలాంటి స్టార్టప్ ఎకో సిస్టమ్ లేదని.. కేసీఆర్ ముందు చూపు.. కేటీఆర్ తెలివి వల్లే భాగ్యనగరం అద్భుతంగా ఉందని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం వల్లే తెలంగాణకు అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయని సెయింట్ ఛైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

“ఈ కంపెనీకి వస్తే ఐటీ కంపెనీకి వచ్చినట్లు లేదు.. దసరా, దీపావళి పండుగ జరుపుకున్నట్లు ఉంది.. అందరు సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పరిశ్రమలు నెలకొల్పడానికి హైదరాబాద్ మహానగరం దేశంలోకెల్లా సౌకర్యవంతమైన నగరం. ఇక్కడ అద్భుతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మనం పోటీ పడాల్సింది బెంగళూరుతో కాదు.. సింగపూర్, మలేసియా వంటి దేశాలతో. మన ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడే మన ఎదుగుదల ఉన్నతంగా ఉంటుంది అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/