నాగోల్ లో ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : నాగోల్ లో దాదాపు రూ.143.58 కోట్ల వ్యయంతో చేపట్టిన ఫ్లై ఓవర్ ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆనంతరం ఆయన మాట్లడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని కేటీఆర్ చెప్పారు. నగర విస్తరణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. మౌలిక వసతులు కల్పించకపోతే బెంగళూరులాగే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ట్రాఫిక్ జాం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ఎస్ఆర్ డీపీ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. రూ. 8052 కోట్లతో 47 ప్రాజెక్టులు చేపట్టామని, ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లోనే 16 ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. రెండవ దశలో 12 ప్రాజెక్టులను చేపడుతామని వివరించారు. ఇప్పటి వరకూ 32 ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మరో 16 ఫ్లై ఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ హాజరయ్యారు.