కంప్యాక్టర్ వాహనాలను ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ భవన నిర్మాణ వ్యర్థాలను తరలించే ఆధునిక కంప్యాక్టర్ వాహనాలను ఈరోజు ఉదయం ప్రారంభించారు. కంప్యాక్టర్ వాహనాల ద్వారా భవన నిర్మాణాల వ్యర్థాలను తరలించనున్నారు. ఇందు కోసం జీహెచ్ఎంసీ 50 వాహనాలను ఏర్పాటు చేసింది. ఒక్కో వాహన సామర్థ్యం 20 క్యూబిక్ మీటర్లు కాగా, అందులో 15 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలించవచ్చు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం వ్యర్థాలను పూర్తిగా కప్పి ఉన్న వాహనంలోనే తరలించాలి. ట్రాన్స్ఫర్ స్టేషన్ల వద్ద సైతం చెత్త కనిపించకుండా తగిన ఏర్పాట్లు చేయాలి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కాంట్రాక్టు సంస్థ రాంకీ ఎన్వీరో సంయుక్తంగా పలు ఆధునిక విధానాలను చేపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆధునిక కాంప్యాక్టర్ వాహనాలు, చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/