ఫ్లై ఓవ‌ర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం ఉద‌యం బాలాన‌గ‌ర్ చౌర‌స్తాలో నిర్మించిన ఫ్లై ఓవ‌ర్‌ను ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవ‌ర్‌ 1.13 కిలోమీటర్ల దూరం.. 24 మీటర్ల వెడల్పుతో రూ. 387 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని ఆరు లేన్లతో నిర్మించారు. వంతెనపై బీటీరోడ్డు వేయడంతో పాటు మధ్యలో డివైడర్‌ సైతం ఏర్పాటు చేశారు. ఎల్‌ఈడీ వీధిలైట్లు అమర్చారు. ఈ వంతెనతో ట్రాఫిక్‌ కష్టాలు తీరడమే కాదు.. ఈ ప్రాంతం మీదుగా సికింద్రాబాద్‌-కూకట్‌పల్లి-అమీర్‌పేట-జీడిమెట్ల  వైపునకు రాకపోకలు సాగించే వారికి వెసులుబాటు కలుగుతుంది.

ఫ్లైఓవర్‌ ప్రారంభం అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కూకట్‌పల్లి-సికింద్రాబాద్‌ మార్గంలో ట్రాఫిక్‌ కష్టాలు తీరుతాయన్నారు. త్వరలో రహదారుల విస్తరణ చేపడతామన్నారు. ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మిస్తామని తెలిపారు. ఫతేనగర్‌ ఫ్లైఓవర్‌ను విస్తరిస్తామని కేటీఆర్‌ వెల్లడించారు.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధ‌వ‌రం కృష్ణారావు, వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ న‌వీన్ రావుతో పాటు స్థానిక కార్పొరేట‌ర్లు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌కు బోనాల‌తో మ‌హిళ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/