కృష్ణా జలాల విషయంలో తాము ఎవరితోనూ రాజీపడం
ఏపీతోనే కాదు, అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడుతాం: కేటీఆర్
నారాయణపేట: మంత్రి కేటీఆర్ ఈరోజు నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. కృష్ణా నదీ జలాల విషయంలో తాము ఎవరితోనూ రాజీపడబోమని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం తమకు రావాల్సిన నీటి కేటాయింపుల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో ఏపీతోనే కాదు, అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడుతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు పరమావధి అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఒక్కటైన పొరుగు రాష్ర్టాల్లో అమలు అవుతున్నాయా? అని ప్రశ్నించారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మీ, పథకాలు పక్కనే ఉన్న కర్ణాటకలో అమలు అవుతున్నాయా? ఒక్కసారి నారాయణ పేట ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. భారతదేశంలో అత్యధికంగా వరి పంట పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది అని కేటీఆర్ గుర్తు చేశారు. ఊహించని విధంగా వరి పంట పండింది.. రైతుల దగ్గర పంట కొన్నాము అని తెలిపారు. వ్యవసాయ అనుబంధ పరివ్రమలు నెలకొల్పుతామన్నారు. గతంలో పాలమూరులో 14 రోజులకు ఒకసారి మంచినీళ్లు వచ్చేవి.. ఇప్పుడు రోజు తప్పించి రోజు మంచినీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. నారాయణపేట జిల్లాలో కలెక్టరేట్, ఎస్పీ భవనాల నిర్మాణం కూడా చేపడుతామన్నారు. రాజకీయాలకు అతీతంగా పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి ముందు తరాలకు మంచి భవిష్యత్ను అందివ్వాలి అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/