బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలిః మంత్రి కెటిఆర్‌

తెలంగాణ ప్రజలు మంచి ప్రభుత్వాన్నే ఎన్నుకుంటారని వెల్లడి

minister-ktr-comments-on-bjp-and-congress-cm-candidate

హైదరాబాద్‌ః తెలంగాణ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రానున్న ఎన్నికల పై స్పందించారు. ప్రజలు మంచి ప్రభుత్వాన్నే ఎన్నుకుంటారని పేర్కొన్నారు. నీళ్లు-నిధులు-నియామకాల స్ఫూర్తితో పనిచేసిన బిఆర్ఎస్ ప్రజల నమ్మకాన్ని చూరగొందని, గత 9 ఏళ్ల కాలంలో తెలంగాణ సర్వతోముఖ అభివృద్ధి సాధించిందని తెలిపారు. కానీ, పనిలేని ప్రతిపక్షాలు తొమ్మిదేళ్లుగా తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారని, ఏనాడూ రుజువులు చూపించలేకపోయారని వెల్లడించారు. విపక్షాలలో హేతుబద్ధత లోపించిందని విమర్శించారు. చేతిలో ఉన్న రూపాయిని పారేసుకుని, చిల్లర ఏరుకోవద్దని మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చిల్లర రాజకీయాలకు పాల్పడే నేతలను ప్రజలు దూరం పెడతారన్న సంగతి తమకు తెలుసని అన్నారు.

ఈసారి కూడా ఎన్నికల్లో గెలిచేది బిఆర్ఎస్ పార్టీయేనని, తమకు 90 నుంచి 100 స్థానాలు లభించడం ఖాయమని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇక, తెలంగాణలో అధికారంలోకి వస్తామని షర్మిల, కేఏ పాల్ వంటివారు కూడ చెబుతున్నారని, అధికారంలోకి వస్తామనే భ్రమల్లో ఉంటే అది కాంగ్రెస్ నేతల ఇష్టమని వ్యంగ్యం ప్రదర్శించారు. సోషల్ మీడియాలో సందడి చేయడం తప్ప తెలంగాణలో బిజెపి ఉనికే లేదని కెటిఆర్ కొట్టిపారేశారు. దేశంలో తెలంగాణ కంటే మంచి మోడల్ ఎక్కడుందో బిజెపి, కాంగ్రెస్ నేతలు చూపించాలని… ఆ రెండు జాతీయ పార్టీలు 75 ఏళ్లలో చేయని పనిని తాము తొమ్మిదేళ్లలోనే చేసి చూపిస్తున్నామని తెలిపారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని కెటిఆర్ సవాల్ విసిరారు.