కేటీఆర్, రాజాసింగ్ ల మధ్యా ట్వీట్ల వార్

తన బైకుపై వస్తే అభివృద్ధి ఎలా ఉందో చూపిస్తానన్న రాజాసింగ్
ముందు పెట్రోల్ బంకులకు వెళ్లాలని కేటీఆర్ కౌంటర్

హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. పాతబస్తీని అభివృద్ధి చేస్తామంటూ అసెంబ్లీలో మాట్లాడుతున్నారని, అయితే, కేటీఆర్ తనతో బుల్లెట్ బైక్ మీద వస్తే అభివృద్ధి ఎలా ఉందో చూపిస్తానంటూ వారం క్రితం రాజాసింగ్ ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశారు. ప్రభుత్వం చెబుతున్నదానికి, చేస్తున్న దానికి పొంతన లేదని విమర్శించారు.

దానికి తాజాగా కేటీఆర్ బదులిచ్చారు. ‘‘నేను మీతో రావడానికి బదులు.. మీరే పెట్రోల్ బంకుకు వెళ్లి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటే బాగుంటుందేమో? ప్రతి ఇంటికీ వెళ్లి గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల గురించి మాట్లాడండి. జీడీపీ వృద్ధి అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల పెంపు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ అబద్ధాలు ఆపి పనులతో ప్రజల మనసులను గెలుచుకోండి’’ అంటూ ట్వీట్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/