ఇలాంటి వాటికి సోనుసూద్‌ భయపడాల్సిన అవసరం లేదు: కేటీఆర్

కేటీఆర్‌లాంటి నేత ఉంటే నాలాంటి వాళ్ల అవసరం ఉండదు..సోనుసూద్‌


హైదరాబాద్ : సోమవారం హెచ్‌ఐసీసీలో కొవిడ్‌-19 వారియర్స్‌ సన్మాన కార్యక్రమం తెలంగాణ సోషల్‌ ఇంపాక్ట్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, సినీ నటుడు సోనుసూద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనుసూద్‌ మాట్లడుతూ .. మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. కొవిడ్‌తో ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారన్నారు. వాళ్లకు సహాయ పడడమే ఇక తన ముందున్న సవాల్‌ అన్నారు. జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు తాను సహాయ కార్యక్రమాలు చేసినా.. ఒక్క తెలంగాణ నుంచే సమాంతరంగా ప్రతిస్పందించే వ్యవస్థ కనిపించిందని.. అది కేటీఆర్‌ కార్యాలయం అని సోనుసూద్‌ కొనియాడారు.

మంత్రి కేటీఆర్ మాట్లడుతూ.. సోనుసూద్‌ రాజకీయాల్లోకి వస్తాడనే భయంతోనే అతనిపై దుష్ప్రచారం చేశారని కేటీఆర్‌ విమర్శించారు. అందుకే సోనుసూద్‌పై ఐటీ, ఈడీ దాడులు చేయించారన్నారు. అలాగే వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశారని విమర్శించారు. సోనుసూద్‌ రియల్‌ హీరో అనీ.. ఇలాంటి వాటికి సోనుసూద్‌ భయపడాల్సిన అవసరం లేదన్నారు. తాము అండగా ఉంటామన్నారు. కొవిడ్‌ కష్టకాలంలో సోనుసూద్‌ సేవాభావాన్ని చాటుకున్నారని, తన పని.. సేవతో ప్రపంచం దృష్టి ఆకర్షించారన్నారు. విపత్తు సమయాల్లో ప్రభుత్వమే అన్నీ చేయలేదని.. స్వచ్ఛంద సంస్థల చేయూత ఎంతో అవసరమన్నారు. సామాజిక మాధ్యమాల్లో విమర్శ చేయడం సులభమని, బాధ్యతగా సేవ చేయడమే గొప్ప అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/