మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేశ్ కౌంటర్

ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేటీఆర్ అలాంటి మాటలు మాట్లాడుతున్నారు..

అమరావతి: ఏపీ మంత్రి జోగి రమేశ్ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఏపీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, జరిగిన అభివృద్ధి ఏంటో కళ్లారా చూసి తెలుసుకోవాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేటీఆర్ అలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ లాగానే కేటీఆర్ కూడా కాకమ్మ, పిట్ట కథలు చెబుతున్నారని విమర్శించారు. విజయవాడ వచ్చి చూస్తే అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందన్నారు. ఏపీ అభివృద్ధిని చూసేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నాననంటూ చెప్పారు. వాలంటీర్లతో గడపగడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఏపీలో తాగు, సాగు నీటి సమస్య లేనే లేదన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం విరాజిల్లుతోందన్నారు.

‘‘ఏపీకి వస్తే అమ్మ ఒడి కనిపిస్తుంది. ఏపీకి వస్తే ఆసరా కనిపిస్తుంది. 31 లక్షల మందికి ఇళ్లు కట్టించే పట్టణాల నిర్మాణం కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో సచివాలయం కనిపిస్తుంది. డిజిటల్ లైబ్రరీ కనిపిస్తుంది. సచివాలయ వ్యవస్థ బాగుందని తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా మెచ్చుకున్నారు. అక్కడా సచివాలయ వ్యవస్థను పెడతామన్నారు. దేశంలోని ఏ సీఎం కూడా చేయని అభివృద్ధి పనులను జగన్ చేశారు. అన్ని రాష్ట్రాల సీఎంలు జగన్ లా అభివృద్ధి పనులను చేయాలనుకుంటున్నారు. మేం కేబినెట్ లోనూ సామాజిక న్యాయం పాటించాం. ఏపీలో జరిగనట్టు సామాజిక న్యాయం జరగాలని కోరుకుంటున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/