సీఎం దార్శ‌నిక‌త‌తో విద్యుత్ స‌మ‌స్య‌ను అధిగ‌మించాం

త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంలో తెలంగాణ ఐదో స్థానం : మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి

హైదరాబాద్: శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా రాష్ట్రంలో త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో ఉంద‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి త‌ల‌స‌రి విద్యుత్ వినియోగం 2,012 యూనిట్లు. మొత్తం త‌ల‌స‌రి వినియోగానికి సంబంధించి దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో ఉంద‌న్నారు. వృద్ధిరేటులో మొద‌టి స్థానంలో ఉంద‌న్నారు. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత 9,600 మెగావాట్ల సామ‌ర్థ్యాన్ని అద‌నంగా చేర్చ‌డం జ‌రిగింద‌న్నారు. 7,962 మెగావాట్ల ప్రాజెక్టులు వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయి.

టీఎస్ జెన్‌కో ద్వారా థ‌ర్మ‌ల్‌లో 2, 210 మెగావాట్లు, హైడ‌ల్‌లో 3,360 మెగావాట్లు, ఇత‌ర రంగాల నుంచి 2200 మెగావాట్లు, ప్ర‌యివేటు రంగాల నుంచి 570 మెగావాట్లు, సౌర విద్యుత్ నుంచి 3,415 మెగావాట్లు, ప‌వ‌న విద్యుత్ నుంచి 128 మెగావాట్లు అద‌నంగా చేర్చామ‌న్నారు. టీఎస్ జెన్‌కో ద్వారా నిర్మాణంలో ఉన్న‌వి 4,270 మెగావాట్లు, ఎన్టీపీసీ ద్వారా 1600 మెగావాట్లు, సౌర‌విద్యుత్ ద్వారా 2,092 మెగావాట్లు.. మొత్తం క‌లిసి 7,962 మెగావాట్లు నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి. సీఎం కేసీఆర్ దార్శ‌నిక‌త‌తో విద్యుత్ స‌మ‌స్య‌ను అధిగ‌మించాం అని తెలిపారు. రాష్ట్రం ఏర్ప‌డిన ఆరు నెల‌ల్లోనే విద్యుత్ విజయం సాధించామ‌న్నారు. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత అన్ని రంగాల‌కు 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్ అందిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. రైతుల‌కు 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మే అని జ‌గదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/