కార్పొరేట్‌ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు : హ‌రీశ్ రావు

హైదరాబాద్ : రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు మంగళవారం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రుల్లో రూ.12 కోట్ల విలువైన ఆధునిక పరికరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆయా శాఖల హెచ్‌ఓడీలను కోరారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల‌ను తయారు చేస్తున్నామని అన్నారు.

కొత్త‌ పరికరాలు సామాన్యుల వైద్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. జన్యు లోపాలపై ఆధునిక వైద్యం, బోన్ లోపాలు ముందే తెలుసుకునే ఆధునిక పరికరాలను ప్రభుత్వ ఆస్పత్రిలో తొలిసారి ఏర్పాటు చేశామని తెలిపారు. నిమ్స్‌లో 155 ICU బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. మరో 200 ICU బెడ్స్ వచ్చే నెల రోజుల్లో అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ప్రజలు కోవిడ్‌ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని హ‌రీశ్ రావు అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/