హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థిలతో క‌లిసి హ‌రీశ్ రావు ర్యాలీలో

శ్రీరాంపూర్ బ్రిడ్జి క్యాంప్ ఆఫీసు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ

హుజూరాబాద్‌ : హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో టీఆర్ఎస్ కీల‌క నేత‌లు ఆ నియోజ‌క వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న‌లు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మంత్రులు హ‌రీశ్ రావు, గంగుల క‌మ‌లాక‌ర్ శ్రీరాంపూర్ బ్రిడ్జి క్యాంప్ ఆఫీసు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వ‌హించారు.తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న‌ విద్యార్థి నాయకుడు, టీఆర్ఎస్‌వీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌ను త‌మ పార్టీ అభ్య‌ర్థిగా ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈనెల 16వ తేదీన హుజురాబాద్‌ మండలం శాలపల్లిలో కేసీఆర్‌ సభ ఉన్న‌ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌ పరిశీలిస్తున్నారు. కాసేప‌ట్లో అమరవీరుల స్థూపం వద్ద టీఆర్ఎస్ నేత‌లు నివాళులర్పించనున్నారు. అనంత‌రం అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి అక్క‌డి నుంచి జమ్మికుంట మీదుగా భారీ ర్యాలీతో ఇల్లందకుంటకు చేరుకుంటారు. అక్కడి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వ‌హిస్తారు. ఆ త‌ర్వాత వీణవంకలో జ‌ర‌గ‌నున్న సభకు హాజ‌ర‌వుతారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/