కొంచెం జాగ్ర‌త్త ఉంటే క‌రోనాను అరిక‌ట్టొచ్చు : మంత్రి హ‌రీశ్‌రావు

హైదరాబాద్: ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ఓల్డ్ బోయిన్‌ప‌ల్లిలో బ‌స్తీ ద‌వాఖానాను ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న ప్ర‌సంగించారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తే ఏ మైక్రాన్ కూడా మ‌న వ‌ద్ద‌కు రాదు. డెల్టా, ఆల్ఫా, ఒమిక్రాన్ వేరియంట్ ఏది కూడా మ‌న ద‌రి చేర‌దు. కొంచెం జాగ్ర‌త్త ఉంటే క‌రోనాను అరిక‌ట్టొచ్చు. టీకాలు ప్ర‌తి ఒక్క‌రూ తీసుకోవాలి అని హ‌రీశ్‌రావు కోరారు. తెలంగాణ వ్యాప్తంగా 2 కోట్ల 51 ల‌క్ష‌ల మంది మొద‌టి డోసు తీసుకున్నారు. రెండో డోసు కోటి 30 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే తీసుకున్నారు. చాలా మంది రెండో డోసు తీసుకోలేదు. ఈ సంఖ్య పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. టీకాలు సుర‌క్షిత‌మైన‌వి. అనుమానాలు, అపోహాలు అవ‌స‌రం లేదు. రెండు డోసులు తీసుకుంటే మ‌న ప్రాణాల‌ను కాపాడుకోవ‌చ్చు. 18 ఏండ్లు దాటి ప్ర‌తిన ఒక్క‌రూ రెండు డోసులు తీసుకోవాలి. టీకాలు వేసేందుకు ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

ఒమిక్రాన్ తెలంగాణ‌కు రాలేదు అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. క‌ర్ణాట‌క‌లో ఇద్ద‌రికి ఒమిక్రాన్ వేరియంట్ వ‌చ్చిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ధారించింది. మ‌న హైద‌రాబాద్‌లో, తెలంగాణ‌లో దేవుని ద‌య‌వ‌ల్ల రాలేదు. బ్రిట‌న్ నుంచి వ‌చ్చిన మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఆమె శాంపిళ్ల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాం. నాలుగైదు రోజుల్లో ఆమెకు ఏ వేరియంట్ సోకింది అనేది తెలుస్తుంది. మాస్కు ధ‌రించండి.. టీకాలు వేసుకోండి.. చేతులు శుభ్రంగా క‌డుక్కోవాలి. స్వీయ నియంత్ర‌ణ పాటించాలి. వీట‌న్నింటిని పాటిస్తే క‌రోనాను త‌రిమికొట్టొచ్చు. ప్ర‌భుత్వానికి ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాలి అని మంత్రి హ‌రీశ్‌రావు విజ్ఞ‌ప్తి చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/