పంట పండించిన రైతులు ఎక్కడకు వెళ్లాలి : హరీష్ రావు

రైతులను కేంద్రం నట్టేట ముంచింది..హరీష్ రావు

హైదరాబాద్: ఏ ప్రభుత్వాలైనా ప్రజల కోసమే పని చేయాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులను రోడ్డు మీద పడేసిందని విమర్శించారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల కోసం మంత్రులు ఢిల్లీకి వెళ్తే… ఢిల్లీ పెద్దలు అవమానించారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని అన్నారు. సిద్ధిపేట వ్యవసాయ మార్కెట్ లో విత్తన ధృవీకరణ సంస్థ కొత్త భవనం, గోదాములకు హరీశ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, జెడ్పీ ఛైర్మన్ రోజా శర్మ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల సాయిరాం, వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

వరి ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మాలని గతంలో కేంద్ర చెప్పిందని… ఇప్పుడు దిగుబడి ఎక్కువ వచ్చేసరికి వద్దంటున్నారని హరీశ్ విమర్శించారు. పంట పండించిన రైతులు ఎక్కడకు వెళ్లాలని ప్రశ్నించారు. పామ్ ఆయిల్ పంటతో ఎక్కువ లాభాలు ఉన్నాయని… రైతులు ఈ పంటను అందిపుచ్చుకోవాలని అన్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల దృష్టి సారించాలని సూచించారు. సిద్ధిపేట మార్కెట్ యార్డుకు రాష్ట్రంలోనే తొలి ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చిందని తెలిపారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/