కిషన్రెడ్డిపై హరీష్ రావు విమర్శలు
కిషన్ రెడ్డిది రెండు నాలుకల ధోరణి .. హరీష్ రావు
హైదరాబాద్: ధాన్యం మద్దతు ధర కంటే రైతుకు ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినా రాష్ర్టం నుంచి వరి ధాన్యాన్ని సేకరించమని రాష్ర్ట ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17న రాష్ర్టాలకు కేంద్రం లేఖ రాసిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. కేంద్రం పరోక్షంగా సన్న వడ్లకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వద్దని రాష్ర్టాలకు లేఖ రాస్తే.. అదే కేంద్ర మంత్రి ఎక్కువ ధర చెల్లించాలని డిమాండ్ చేయడం రెండు నాలుకల ధోరణి కాదా? అని మంత్రి ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్రం రాష్ర్టాలకు రాసిన లేఖను మీడియాకు మంత్రి విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులకు మద్దతు ధర కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. సన్న రకాలకు ఎక్కువ ధర ఇవ్వాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న కిషన్ రెడ్డి.. కేంద్రం రాసిన లేఖను వెనక్కి తీసుకునేలా ప్రయత్నించాలని సూచించారు. కేంద్రం లేఖ రాష్ర్టాలకు మెడ మీద కత్తిలా ఉందని ధ్వజమెత్తారు. ఒక్క రూపాయి ఎక్కువ చెల్లించిన ధాన్యం సేకరమించమని ఎఫ్సీఐ తేల్చిచెప్పిందన్నారు. కేంద్రం తక్షణమే లేఖను ఉపసంహరించుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/